చండీఘఢ్ : హర్యానాలోని నుహ్ ప్రాంతంలో మైనింగ్ మాఫియా చేతిలో ప్రాణాలు కోల్పోయిన డీఎస్పీ సురేందర్ సింగ్ను అమరవీరుడిగా గుర్తిస్తూ హర్యానా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీఎస్పీ కుటుంబానికి రూ కోటి నగదును అందచేయనున్నట్టు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు.
పరిహారంతో పాటు బాధిత కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన డీఎస్పీ కుటుంబానికి రూ కోటి పరిహారంతో పాటు వారి కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని సీఎం ఖట్టర్ పేర్కొన్నారు.
నుహ్ ప్రాంతంలో వాహనాన్ని తనిఖీ చేస్తున్న సురేంద్ర సింగ్ను మైనింగ్ మాఫియాకు చెందిన డంపర్ డ్రైవర్ వాహనంతో ఢీకొట్టడంతో సింగ్ మరణించారు. తౌరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పచగావ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. అక్రమ మైనింగ్కు పేరొందిన ఈ ప్రాంతంలో తనిఖీ కోసం సురేంద్ర సింగ్ తన టీంతో కలిసి వచ్చినప్పుడు ఈ దారుణ ఉదంతం చోటుచేసుకుంది.