చండీగఢ్: ఆయన ఓ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. 86 ఏండ్ల వయస్సు పదో తరగతి కంపార్ట్మెంట్ పరీక్షలు రాశాడు. అదికూడా ఇంగ్లిష్ పేపర్. అదేంటి పదో తరగతి పాస్ కాకుండానే రాష్ట్రాన్ని ఏలాడనుకుంటున్నారా.. అవును ఇది నిజమే. హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా నిన్న పదో తరగతి ఇంగ్లిష్ పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జేబీటీ రిక్రూట్మెంట్ కేసులో 2013లో ఆయనకు సీబీఐ కేసు 10ఏళ్ల జైలు శిక్ష విధించింది. తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తూనే పదో తరగతి పరీక్షలు రాశారు. కానీ అప్పుడు ఇంగ్లీష్ పరీక్ష రాయలేదు.
ఆ తర్వాత ఓపెన్లో భివాని ఎడ్యుకేషన్ బోర్డు 12వ తరగతి పరీక్షలు రాశారు. ఆగస్టు 5న ఆ పరీక్షల ఫలితాలు వచ్చాయి. కానీ చౌతాల ఫలితాన్ని బోర్డు నిలిపివేసింది. పెండింగ్లో ఉన్న పదో తరగతి ఇంగ్లిష్ పరీక్ష పూర్తి చేస్తేనే ఫలితాన్ని వెల్లడిస్తామని స్పష్టం చేసింది. దీంతో ఆయన సిర్సాలోని ఆర్య కన్య సీనియర్ సెకండరీ స్కూల్ పరీక్ష కేంద్రంలో కంపార్ట్ మెంట్ పరీక్ష రాశారు.
ఈ సందర్భంగా అక్కడే ఉన్న విలేకరులు పలు ప్రశ్నలు అడగగా.. తాను ప్రస్తుతం విద్యార్థినని, నో కామెంట్స్ అని అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, చౌతాలో ఓ సహాయకుడిని పెట్టుకుని పరీక్ష రాయడం విశేషం. 2017లో తన 82 ఏండ్ల వయస్సులో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్లో 10వ తరగతి పరీక్ష రాశారు. అందులో 53.4 శాతం మార్కులు సాధించారు.