Dengue deaths | హర్యానా డెంగ్యూ గుప్పిట్లో బంధిగా మారింది. ఈ ఏడాదిలో కేవలం 10 నెలల్లోనే డెంగ్యూ కారణంగా 14 మంది మరణించారు. గతేడాది ఈ సంఖ్య 13 గా ఉన్నది. నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఈ ఏడాది ఇప్పటివరకు 6,151 మంది నివేదికలు పాజిటివ్గా వచ్చాయి. ఇంతగా డెంగ్యూ కేసులు నమోదవుతున్నా హర్యానా ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హర్యానాలో రోజుకు సగటున 100 మంది రోగులు డెంగ్యూ చికిత్సకు వస్తున్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ 500 కంటే ఎక్కువ శాంపిల్స్ తీసుకుంటుండగా.. అందులో 100 మందికి పాజిటివ్గా ఉన్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా పంచకుల, హిస్సార్ జిల్లాల్లో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి. పంచకులలో ఇప్పటివరకు 1,787 మంది డెంగ్యూ బారిన పడ్డారు. హిసార్లో 1,158 మందిని పాజిటివ్గా గుర్తించారు. గురుగ్రామ్లో 422, యమునా నగర్లో 539, అంబాలాలో 252, రేవారిలో 222 మంది రిపోర్టులు పాజిటివ్గా వచ్చాయి.
2015లో 13 మంది డెంగ్యూ సోకి మరణించగా, 9,921 మంది పాజిటివ్గా తేలారు. 2016 లో 2,494 పాజిటివ్ కేసులు నమోదైనా ఏ ఒక్కరు చనిపోలేదు. 2017లో 4,550, 2018 లో 1,936 కేసులు, 2019 లో 1,207 కేసులు, 2020 లో 1,377 కేసులు రికార్డయ్యాయి. 2021 లో 13 మంది డెంగ్యూ రోగులు మరణించగా, 11,835 మందికి డెంగ్యూ నిర్ధారణ జరిగింది. ఇంత జరిగినా హర్యానా ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోలేదు. దాంతో ప్రస్తుతం డెంగ్యూ పరిస్థితి అధ్వానంగా మారింది.