చండీగఢ్: బీజేపీ నాయకులు, కార్యకర్తల వైపు కన్నెత్తి చూస్తే కండ్లు పీకేస్తామని, చెయ్యి ఎత్తి చూపితే చెయ్యి నరికేస్తామని రోహతక్ ఎంపీ, బీజేపీ నేత అర్వింద్ శర్మ హెచ్చరించారు. హర్యానాకు చెందిన మాజీ మంత్రి మనీశ్ గ్రోవర్, కొంతమంది బీజేపీ నేతలను శుక్రవారం రోహతక్లోని ఓ ఆలయ కాంప్లెక్స్లో కొన్ని గంటలపాటు రైతులు, స్థానికులు నిర్బంధించారు. ఈ నేపథ్యంలో శనివారం ఎంపీ అర్వింద్ శర్మ స్పందిస్తూ ‘గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత భూపేందర్ సింగ్ హుడా కుమారుడు దీపేందర్ హుడా ఓడిపోయారు. ఈ కారణంతోనే మనీశ్ గ్రోవర్పై పగ పెంచుకున్న కాంగ్రెస్ నేతలు ఇలాంటి నిర్బంధాలకు పాల్పడుతున్నారు. ఎవరైనా మా నాయకులు, కార్యకర్తల వైపు కన్నెత్తి చూస్తే కండ్లు పీకేస్తాం. చెయ్యి ఎత్తి చూపితే ఆ చెయ్యిని నరికేస్తాం’ అని హెచ్చరించారు.