దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఒక్కో రాష్ట్రం వరుసగా నైట్ కర్ఫ్యూల దిశగా కదులుతోంది. తాజాగా మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను ప్రకటించింది. రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకూ ఈ నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందని పేర్కొంది. అయితే అత్యవసర సేవలకు మాత్రం ఎప్పటిలాగే మినహాయింపు ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఖట్టర్ నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే నైట్ కర్ఫ్యూ విధించాలని నిర్ణయం తీసుకున్నారు.
దేశంలో మొట్ట మొదట నైట్ కర్ఫ్యూను విధించిన రాష్ట్రం మధ్యప్రదేశ్. అయితే అక్కడ ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా వెలుగు చూడలేదు. ముందుస్తు చర్యల్లో భాగంగానే నైట్ కర్ఫ్యూ ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇక నైట్ కర్ఫ్యూ విధించిన రెండో రాష్ట్రం యూపీ. శనివారం నుంచి నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందని యోగి ప్రభుత్వం ప్రకటించింది. ఈ జాబితాలో మూడో స్థానం హర్యానా.