న్యూఢిల్లీ: రైతు నాయకులపై హర్యానా వ్యవసాయ శాఖ మంత్రి, బీజేపీ నేత జేపీ దలాల్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘ఇక్కడ ధర్నా చేసే కొందరు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. కొందరు తప్పుడు పనులు చేశారు. కొందరి భార్యలు ఇతరులతో కలిసి పారిపోయారు. వారి భార్యలు కూడా వారి మాట వినరు. అయినా వారు మొత్తం రైతులందరి బాధ్యత తీసుకుంటున్నారు’ అని భివానీ జిల్లాలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యానించారు.
మంత్రి వ్యాఖ్యలపై సంయుక్త్ కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. పంచకులలో జరిగిన ఒక సమావేశంలో ఎస్కేఎం, కేంద్ర కార్మిక సంఘాలు ఈ మేరకు తీర్మానం చేశాయి. మంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేసి క్షమాపణలు చెప్పాలని ఎస్కేఎం డిమాండ్ చేసింది. రైతుల ఉద్యమాన్ని తక్కువ చేసి చూపేలా, మహిళల గౌరవాన్ని కించపరిచేలా మంత్రి వ్యాఖ్యానించారని దుయ్యబట్టింది.