డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి అవకాశం లేదని సీనియర్ కాంగ్రెస్ నేత, ఉత్తరాఖండ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్ధి హరీష్ రావత్ తేల్చిచెప్పారు. ఇది ఢిల్లీ కాదని, ఉత్తరాఖండ్లో మూడో పార్టీకి ఛాన్స్ లేదని స్పష్టం చేశారు. కొత్త పార్టీలను ఉత్తరాఖండ్ ప్రజలు తోసిపుచ్చుతారని అన్నారు. ఉద్యమ నేపధ్యం ఉన్న ఉత్తరాఖండ్ క్రాంతి దళ్ను రాష్ట్ర ప్రజలు తిరస్కరించారని అన్నారు.
ఉత్తరాఖండ్లో కొత్త పార్టీకి అవకాశం లేదు..ఇది ఢిల్లీ కాదని హరీష్ రావత్ వ్యాఖ్యానించారు. హరక్ సింగ్ రావత్, యశ్పాల్ ఆర్య వంటి నేతలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పార్టీలో ఉత్తేజం నెలకొంది.
ప్రముఖ దళిత నేత ఆర్య, తన కుమారుడు సిట్టింగ్ ఎమ్మెల్యేతో కలిసి కాంగ్రెస్లోకి తిరిగి రావడం ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీని దీటుగా ఎదుర్కొని పాలనా పగ్గాలు చేపట్టాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. ఇక ఫిబ్రవరి 14న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు.