న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్ పార్టీ వ్యవహారాలకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనాయకత్వం లక్ష్యంగా విమర్శలు గుప్పించిన పార్టీ సీనియర్ నేత హరీష్ రావత్ శుక్రవారం పార్టీ నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఉత్తరాఖండ్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచార సారధిగా తాను ముందుండి నడిపిస్తానని రాహుల్తో భేటీ అనంతరం హరీష్ రావత్ పేర్కొన్నారు. ఎన్నికల్లో పార్టీకి నేతృత్వం వహిస్తానని ముఖ్యమంత్రి ఎవరనేది తర్వాత నిర్ణయిస్తారని చెప్పారు.
రాష్ట్ర సంక్షేమానికి కట్టుబడిన విధేయత కలిగిన పార్టీ నేతను తానని ఆయన చెప్పుకొచ్చారు. అందరూ కలిసి అడుగేసి కాంగ్రెస్ను గెలిపిస్తామని పేర్కొన్నారు. రావత్ బుధవారం వరుస ట్వీట్లలో పార్టీ నాయకత్వంపై విమర్శలు గుప్పించడం కలకలం రేపింది. కాంగ్రెస్ ఉత్తరాఖండ్ విభాగంలో వర్గ పోరు తీవ్రమైందని, ఇక విశ్రాంతి తీసుకునే సమయం ఇదేననే ఆలోచనలు రేకెత్తుతున్నాయని ఆ ట్వీట్లలో వ్యాఖ్యానించారు.
సహకారం, సమన్వయంతో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సమాయాత్తం కావాల్సి ఉండగా పలు చోట్ల సంస్ధాగత నిర్మాణం సవ్యంగా లేదని, ప్రతికూల పాత్రనూ పోషిస్తోందని రావత్ స్పష్టం చేశారు. రావత్ వ్యాఖ్యలతో ఉత్తరాఖండ్లో పార్టీ వ్యవహారాలను గాడినపెట్టేందుకు కాంగ్రెస్ నాయకత్వం చొరవ తీసుకుంది. హరీష్ రావత్తో రాహుల్ సమావేశమై ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, సీనియర్ నేతల మధ్య సమన్వయం సాధించడంపై సుదీర్ఘంగా చర్చించారు.