డెహ్రడూన్ : తరగతి గదుల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకువెళ్లేందుకు టీచర్లకు అనుమతి నిరాకరిస్తూ ఉత్తరాఖండ్లోని హరిద్వార్ జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. క్లాస్రూంల్లో టీచర్లు మొబైల్ ఫోన్లతో కనిపిస్తే తీవ్ర క్రమశిక్షణా చర్యలు చేపడతామని జిల్లా మేజిస్ట్రేట్ వినయ్ శంకర్ పాండే హెచ్చరించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్ధలన్నింటికీ వర్తిస్తుందని పాండే తెలిపారు.
క్లాస్రూంల్లో అడుగుపెట్టేముందు టీచర్లు తమ మొబైల్ ఫోన్లను ప్రిన్సిపల్ రూంలో వదిలివేయాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఇటీవల పలువురు టీచర్లు క్లాస్రూంల్లోనూ మొబైల్ ఫోన్లతో బిజీగా ఉండటం తమ దృష్టికి వచ్చిందని పాండే చెప్పారు. కొందరు టీచర్లు మొబైల్ ఫోన్లలో గేమ్స్ ఆడుకోవడం, చాటింగ్ చేయడం వంటి పనుల్లో మునిగితేలుతున్నారని తెలిసిందని పాండే పేర్కొన్నారు.
విద్యార్ధులు, తల్లితండ్రుల నుంచి పలు ఫిర్యాదులు అందాయని చెప్పుకొచ్చారు. టీచర్లు స్కూల్స్కు తమ మొబైల్ ఫోన్లను తీసుకురావచ్చని అయితే వాటిని ప్రిన్సిపల్ రూంలో డిపాజిట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశామని అన్నారు. టీచర్లు మొబైల్ ఫోన్ లేకుండా క్లాస్రూంల్లోకి ఎంట్రీ ఇవ్వాలని స్పష్టం చేశారు. వైద్యారోగ్య అత్యవసర పరిస్ధితి తలెత్తిన సందర్భాల్లో ఈ ఉత్తర్వులకు మినహాయింపులు ఉంటాయని చెప్పారు.