న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు మోతెక్కడంతో వాహనం బయటకు తీయాలంటే జనం బెంబేలెత్తుతుండగా భారత్లో పెట్రో ధరలు స్వల్పంగానే పెరిగాయని పెట్రోలియం, సహజవాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి సోమవారం రాజ్యసభలో వెల్లడించారు. భారత్లో ఇటీవల ఇంధన ధరలు కేవలం 5 శాతం పెరిగాయని అదే అమెరికాలో 50 శాతం, కెనడాలో 55 శాతం, జర్మనీలో 58 శాతం, ఫ్రాన్స్లో 55 శాతం చొప్పున పెరిగాయని అన్నారు.
మరోవైపు ప్రజలపై ఇంధన భారాలను తగ్గించేందుకు గత ఏడాది నవంబర్ 5న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిందని గుర్తుచేశారు. పెట్రో ధరలపై పన్నులను తగ్గించడం ద్వారానే వినియోగదారులకు ఊరట ఇవ్వాలని పేర్కొన్నారు.
రాజ్యసభ సభ్యుడు మహ్మద్ అబ్దుల్లా ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి బదులిస్తూ ఆర్ధిక వ్యవస్ధకు ఉత్తేజం కల్పిస్తూ, వినిమయం పెరిగేందుకు, ధరల మంటను తగ్గించేందుకు కేంద్రం గత ఏడాది నవంబర్లో ప్రభుత్వం పెట్రోల్ ధరను లీటర్కు రూ 10, డీజిల్ ధరను లీటర్కు రూ 5 చొప్పున తగ్గించిందని చెప్పారు. ఈ చర్యతో పేదలు, మధ్యతరగతి వర్గాలకు లబ్ధి చేకూరిందని చెప్పారు.