న్యూఢిల్లీ: ఎన్నికల వేళ ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వంలో ముసలం పుట్టింది. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి హరాక్ సింగ్ రావత్పై ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామి వేటు వేశారు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతోపాటు పార్టీ నుంచి ఆరేండ్లపాటు బహిష్కరించారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించారు. ధామీని క్యాబినెట్ నుంచి తొలగించాలని రాష్ట్ర గవర్నర్కు సిఫారసు చేశారు.
ఉత్తరాఖండ్ అసెంబ్లీకి వచ్చేనెల 14న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రావత్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను కలిసినందుకుగాను ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసినట్లు తెలుస్తున్నది. కాగా, ఆయన మరో ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి సోమవారం మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
గత ఎన్నికల్లో కొద్వార్ నియోజకవర్గం నుంచి రావత్ గెలుపొందారు. 2016లో ఎన్నికల ముందు మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరారు. 2017లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 70 స్థానాల్లో 57 సీట్లలో బీజేపీ గెలుపొందింది. కాగా, రాష్ట్రంలో ఈ సారి ముక్కోణపు పోటీ నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు అధికారం కోసం హోరాహోరీగా పోటీపడుతున్నాయి.