అహ్మదాబాద్: ఒక వ్యాపారి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో లక్షల్లో నష్టపోయాడు. దీంతో అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. దీని నుంచి బయటపడేందుకు నకిలీ కిడ్నాప్ డ్రామా ఆడాడు. ఆ వ్యక్తి అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. (Fake Kidnapping) దర్యాప్తు చేసిన పోలీసులు అసలు గుట్టును రట్టు చేశారు. గుజరాత్లోని సూరత్లో ఈ సంఘటన జరిగింది. జూన్ 12న 36 ఏళ్ల వ్యాపారవేత్త జిగ్నేష్భాయ్ అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. ఆందోళన చెందిన అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కాగా, జిగ్నేష్భాయ్ కిడ్నాప్ అయ్యాడంటూ అతడి మొబైల్ ఫోన్ నుంచే కుటుంబ సభ్యుల ఫోన్లకు మెసేజ్లు వచ్చాయి. సురక్షితంగా అప్పగించేందుకు రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకవేళ పోలీసులకు ఫిర్యాదు చేస్తే అతడ్ని చంపేస్తామని, కేవలం మృతదేహం మాత్రమే దొరుకుతుందని ఆ మెసేజ్లో హెచ్చరించారు. అలాగే కిటికీ గ్రిల్కు జిగ్నేష్భాయ్ను కట్టేసి ఉన్నట్లుగా ఒక వీడియో కూడా కుటుంబ సభ్యులకు అందింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు మరింత ఆందోళన చెందారు.
మరోవైపు జిగ్నేష్భాయ్ కిడ్నాప్పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడంతో పాటు సాంకేతిక ఆధారాలతో అతడి సమాచారాన్ని సేకరించారు. కుటుంబ సభ్యులకు అందిన వీడియోను గోద్రాలో రికార్డ్ చేసినట్లు దాని విశ్లేషణ ద్వారా సూరత్ పోలీసులు తెలుసుకున్నారు. దీంతో పోలీస్ బృందాలు అక్కడకు వెళ్లి పలు హోటల్స్లో వెతికారు.
అయితే ఒక హోటల్లో సురక్షితంగా ఉన్న జిగ్నేష్భాయ్ను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని ప్రశ్నించగా ఫేక్ కిడ్నాప్గా తేలింది. స్టాక్ మార్కెట్, ఆప్షన్స్ ట్రేడింగ్లో రూ. 50 లక్షల నుంచి రూ. 60 లక్షల వరకు నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు పోలీసుల విచారణలో అతడు తెలిపాడు. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు తన కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసేందుకు అతడు ఒక్కడే ఈ కిడ్నాప్ నాటకం ఆడాడు. తనకు తానే కిటికీకి బంధించుకుని వీడియో రికార్డ్ చేసి కుటుంబ సభ్యులకు పంపినట్లు వివరించాడు.
కాగా, జిగ్నేష్భాయ్ నకిలీ కిడ్నాప్ నాటకలో ఎవరి ప్రమేయం లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఆ వ్యాపారిపై చట్టపరంగా చర్యలు చేపడతామని పోలీస్ అధికారి వెల్లడించారు.