హల్దానీ, ఫిబ్రవరి 8: ఉత్తరాఖండ్లోని హల్దానీ నగరంలో గురువారం మదర్సా కూల్చివేత సందర్భంగా చెలరేగిన హింసలో 60 మందికి పైగా గాయపడ్డారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడంగా నిర్ధారించిన మదర్సాను అధికారులు కూల్చివేయడానికి ప్రయత్నించినప్పుడు అల్లరి మూక వారిపై రాళ్లు రువ్వింది.
ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో కనిపిస్తే కాల్చివేత, కర్ఫ్యూ ఉత్తర్వులను జిల్లా మెజిస్ట్రేట్ జారీ చేశారు. మసీదు పక్కనే గల మదర్సాను జేసీబీతో కూల్చివేయడానికి అధికారులు, పోలీసులు ప్రయత్నించినప్పుడు అల్లరి మూక రాళ్ల దాడి చేసింది. ఈ ఘటనలో పోలీసులు, అధికారులు, పాత్రికేయులు గాయపడ్డారు. అల్లరి మూకను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించగా.. హింస మరింత ఎక్కువైంది. పోలీస్ స్టేషన్ బయట ఉన్న వాహనాలకు నిరసనకారులు నిప్పు పెట్టారు. నిందితులను గుర్తించామని.. త్వరలోనే అరెస్ట్ చేస్తామని మున్సిపల్ కమిషనర్ పంకజ్ ఉపాధ్యాయ్ వెల్లడించారు.