న్యూఢిల్లీ: దేశ విభజన సమయంలో కొంత జాగ్రత్త తీసుకుని ఉంటే కర్తార్పూర్ సాహిబ్ పాకిస్థాన్లో ఉండేది కాదని, భారత్లో ఉండేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో సిక్కు సమాజం చాలా పెద్ద సహకారం అందించిందని కొనియాడారు. మనకు స్వేచ్ఛ లభించినప్పుడు, విభజన విషాదాన్ని ఎదుర్కొన్నప్పుడు సిక్కులు చాలా బాధపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన సిక్కు కమ్యూనిటీ కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ పాల్గొని ప్రసంగించారు. భారతీయ సంస్కృతి గతంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొందని అన్నారు. భారతీయ సంస్కృతి నేడు కొనసాగడానికి కారణం సిక్కు సమాజమని అన్నారు.
‘సిక్కు సమాజానికి చాలా అద్భుతమైన చరిత్ర ఉంది. కానీ, వ్యంగ్యం ఏమిటంటే వారిలో చాలా మందికి వారి చరిత్ర తెలియదు’ అని రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. యువతకు సిక్కు సమాజ చరిత్రను నేర్పించమని తాను చెప్పానని అన్నారు. సిక్కు సమాజం అందించిన సహకారాన్ని ఈ దేశం ఎన్నటికీ మర్చిపోదని చెప్పారు. ‘కొంతమంది ‘ఖలిస్థాన్’ డిమాండ్ చేస్తున్నారు. మీరు ‘ఖలిస్థాన్’ గురించి ఎందుకు మాట్లాడతారు. మొత్తం ‘హిందుస్థాన్’ మీదే’ అని ఆయన అన్నారు.