ప్రయాగ్రాజ్, ఫిబ్రవరి 26: జ్ఞానవాపీ మసీదు సెల్లార్లో పూజలకు అనుమతించిన వారణాసి కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు సోమవారం తిరస్కరించింది. మసీదులోని వ్యాస్ తెహ్ఖానాలో పూజలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. మసీదు కమిటీ సంయుక్త కార్యదర్శి హైకోర్టు తీర్పుపై స్పందిస్తూ తాము సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామన్నారు.
జిల్లా కోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు నిరాకరిస్తూ.. హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. సుప్రీం సూచనతో మసీదు కమిటీ ఫిబ్రవరి 2న హైకోర్టును ఆశ్రయించింది. మొఘల్ చక్రవరి ఔరంగజేబు పాలనలో హిందూ దేవాలయ అవశేషాలపై జ్ఞానవాపీ మసీదు నిర్మించారని కోర్టు ఆదేశాలపై ఏఎస్ఐ సర్వేలో వెల్లడైంది. మసీదు దక్షిణ సెల్లార్లో హిందువుల పూజలకు అనుమతిస్తూ జనవరి 31న జిల్లా కోర్టు తీర్పునిచ్చింది.