త్రిసురు: కేరళలోని పద్మనాభస్వామి ఆలయం ఆస్తుల విలువ లక్షల కోట్లల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ రాష్ట్రానికే చెందిన మరో ఆలయం ఆస్తులు విలువ కూడా బయటకు వచ్చింది. గురువాయుర్లోని శ్రీ కృష్ణ ఆలయం వద్ద సుమారు 1737 కోట్ల బ్యాంక్ డిపాజిట్లు ఉన్నట్లు తేలింది. ఆర్టీఐ ఆధారంగా ఈ విషయం తెలిసింది. ఇక ఆలయం ఆధీనంలో సుమారు 271 ఎకరాల భూమి కూడా ఉన్నట్లు ఆర్టీఐలో తెలిపారు.
ఆ గుడికి బంగారం, వెండితో పాటు ఇతర ఖరీదైన వజ్రాలు కూడా కానుకల రూపంలో అందాయి. అయితే వాటి విలువను తెలుపేందుకు ఆలయ మేనేజ్మెంట్ అంగీకరించలేదు. సెక్యూర్టీ కారణాల వల్ల ఆ విషయాన్ని చెప్పడం లేదన్నారు. గురువాయుర్ ఆలయంలో శ్రీకృష్ణుడిని పూజిస్తారు. ఆ దేవాలయానికి ప్రతి ఏడాది వేలాది సంఖ్యలో భక్తులు వస్తుంటారు.
గురువాయుర్కు చెందిన స్థానికుడు ఎంకే హరిదాస్ ఆర్టీఐలో దరఖాస్తు చేశాడు. దీనిపై గురువాయుర్ దేవస్థానం సమాధానం ఇచ్చింది. ఆలయం వద్ద డిపాజిట్ల రూపంలో 1737 కోట్లు ఉన్నట్లు దేవస్థానం బోర్డు తెలిపింది. వేర్వేరు బ్యాంకుల్లో ఆ డిపాజిట్లు ఉన్నట్లు తెలిపారు. 2016లో పినరయి రవి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయానికి ఎటువంటి ఆర్థిక సాయం అందలేదన్నారు.