కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందించండి
సిరిసిల్ల జిల్లా అధికారులను ఆదేశించినమంత్రి కేటీఆర్
కలెక్టర్ కృష్ణభాస్కర్తో టెలీకాన్ఫరెన్స్
సేవలందిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి కృతజ్ఞతలు
రాబోయే రెండు వారాలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి
రాజన్న సిరిసిల్ల, మే 12 (నమస్తే తెలంగాణ): కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారులను ఆదేశించారు. కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. రాబోయే రెండు వారాలు అత్యంత కీలకమని, లాక్డౌన్ నియమాలను పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని తన నివాసం నుంచి బుధవారం కలెక్టర్ కృష్ణభాస్కర్, ఇతర అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. జిల్లాలో కొవిడ్ నివారణకు తీసుకుంటున్న చర్యలు, బాధితులకు అందుతున్న వైద్య సేవలు, లాక్డౌన్ అంశాలపై సమీక్షించి, చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్ధేశం చేశారు. కరోనా విజృంభిస్తున్న వేళ తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందిస్తున్న వైద్యులు, ఆశ కార్యకర్తలు, మెప్మా, 108, పారిశుధ్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, అధికారులందరికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రైవేటు, ప్రభుత్వ దవాఖానల్లో కరోనా పేషంట్లకు అందిస్తున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఆయా దవాఖానల్లో అందుబాటులో ఉన్న పడకలు, ఆక్సిజన్ నిర్వహణ, పేషంట్లకు అందుతున్న వైద్యం పట్ల కూలంకషంగా అడిగి తెలుసుకున్నారు. ఆక్సిజన్ రవాణా విషయంలో క్షేత్ర స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందు చూపుతో వ్యవహరించాలని సూచించారు. స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష అని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 45 ఏండ్ల పైబడిన ఎంతమందికి వ్యాక్సిన్ వేశారన్న వివరాలు కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. మొదటి దశలో తీసుకున్న వారందరికీ రెండో దశ టీకాలు తీసుకునేలా ఆరోగ్య కార్యకర్తలు అవగాహన కల్పించాలని ఆదేశించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా సర్వే సత్ఫలితాలు ఇస్తుందని చెప్పారు. ఆరోగ్య కార్యకర్తలు చేస్తున్న ఇంటింటా సర్వే ద్వారా వ్యాధి వ్యాప్తిని కట్టడి చేయడం సులభతరం అవుతుందని తెలిపారు. కరోనా కట్టడికి చేపడుతున్న చర్యలపై రోజు వారీగా తాను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తానని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ పరంగా అవసరమైన అన్ని చర్యలు చేపడుతూ కరోనా రెండో దశ కట్టడికి కృషి చేస్తానని, ప్రజలు ప్రభుత్వానికి సహకరించి తోడ్పాటు అందించాలని కోరారు.