Building Collapse | ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్లోని జాంనగర్ సిటీలో శుక్రవారం సాయంత్రం మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒక మహిళ, నాలుగేండ్ల బాలుడితోపాటు నలుగురు వ్యక్తులు మరణించారు. సాధనా కాలనీ ప్రాంతంలోని దాదాపు 30 ఏండ్ల క్రితం నాటి భవనం గుజరాత్ హౌసింగ్ బోర్డు నిర్మించిందని స్థానికులు చెప్పారు. ఇప్పుడు అది పూర్తి శిధిలావస్థకు చేరుకున్నదని తెలిపారు.
ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న అగ్ని మాపక దళ సిబ్బంది, స్థానికులు కలిసి భవన శిధిలాల నుంచి ఎనిమిది మందిని కాపాడారు. వారిలో ముగ్గురు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. మరో ఐదుగురు చికిత్స పొందుతున్నారని గురు గోవింద్ సింగ్ ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ దీపక్ తివారీ తెలిపారు. మరణించిన వ్యక్తులు జైపాల్ స్వాధియా (35), మిట్టల్ స్వాదియా (35), శివరాజ్ (4), మరొక వ్యక్తి ఉన్నారు. గాయపడిన వారిలో ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారని డాక్టర్ తివారీ తెలిపారు.
భవన శిధిలాల కింద మరికొంత మంది చిక్కుకుని ఉండవచ్చునని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే మున్సిపల్ కమిషనర్ డీఎన్ మోదీ, స్థానిక ఎమ్మెల్యే దివ్యేశ్ అక్బరీ, ఇతర అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ‘ఈ కాలనీలో ప్రతి బ్లాక్ 12 ఫ్లాట్లు ఉన్నాయి. ఈ భవనం 30 నుంచి 35 ఏండ్ల క్రితం నిర్మించారని ఎమ్మెల్యే దివ్యేశ్ అక్బరీ తెలిపారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో ఒక బ్లాక్ లోని ఆరు ఫ్లాట్లు అకస్మాత్తుగా కుప్పకూలాయని చెప్పారు.