Mann Ki Baat | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం.. చారాణా కోడికి బారాణా మసాలా అన్నట్టుగా మారింది. వందవ ఎపిసోడ్ పూర్తయిన సందర్భంగా గుజరాత్ ఆప్ అధ్యక్షుడు ఇసుదాన్ గాధ్వీ ట్వీట్లు సంచలనం సృష్టించాయి. ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంపై ఇప్పటి వరకు చేసిన ఖర్చు రూ.830 కోట్లు కాగా, రాబడి మాత్రం రూ.33 కోట్లు మాత్రమేనని గాధ్వీ ట్వీట్ చేశారు. తగిన ఆధారాల్లేకుండా మన్ కీ బాత్పై వివాదాస్పద పోస్ట్ చేశారంటూ గుజరాత్ సైబర్ క్రైమ్ పోలీసులు గాధ్వీపై కేసు నమోదు చేశారు.
గాధ్వీ ట్వీట్ ప్రకారం మన్ కీ బాత్ ఒక కార్యక్రమానికి రూ.8.3 కోట్లు ఖర్చయితే వంద ఎపిసోడ్లకు రూ.830 కోట్లు ప్రజాధనం ఖర్చయిందని, ప్రకటనల ద్వారా రేడియోకి రూ.33.16 కోట్లు ఆదాయం మాత్రమే వచ్చిందని పేర్కొన్నారు. వెరసి మొత్తంగా నష్టం రూ. 787 కోట్లని ఆయన ట్వీట్ సారాంశం. గాధ్విపై కేసు నమోదు చేసినట్లు సైబర్ క్రైమ్ బ్యాంచ్ అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ జేఎం యాదవ్ మీడియాకు తెలిపారు. ఆ ట్వీట్ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉందన్నారు. విచారణ జరుగుతున్నదని, ఇంకా అరెస్టు చేయలేదని యాదవ్ ప్రకటించారు.