అహ్మదాబాద్ : గుజరాత్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఖేద్బ్రహ్మ నియోజకవర్గం ఎమ్మెల్యే అశ్విన్ కొత్వాల్ తన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ నీమాబేన్ ఆచార్యకు సమర్పించారు.
ఈ సందర్భంగా అశ్విన్ కొత్వాల్ మీడియాతో మాట్లాడారు. 2007 నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇప్పటికీ మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఖేద్బ్రహ్మ నియోజకవర్గ ప్రజలకు సేవలందించాను. తన నియోజకవర్గంలో ఉన్న గిరిజనులు బాగుపడాలంటే తాను బీజేపీలో చేరక తప్పడం లేదు. బీజేపీ వల్లే గిరిజనుల అభివృద్ధి సాధ్యమని తాను నమ్ముతున్నానని కొత్వాల్ తెలిపారు. నరేంద్ర మోదీ గుజరాత్కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పట్నుంచి ఆయన పనితీరును పరిశీలిస్తున్నానని పేర్కొన్నారు. అప్పట్నుంచే ఆయన పని విధానం తనను ఇంప్రెస్ చేసిందని కొత్వాల్ స్పష్టం చేశారు.