ఆన్లైన్లో షేర్లు కొనేందుకు డీమ్యాట్ ఖాతాలు తీసుకుంటారనే సంగతి తెలిసిందే కదా. అలాగే ఖాతా తీసుకున్న రమేష్ సాగర్ అనే వ్యక్తికి తాజాగా పెద్ద షాకే తగిలింది. అతని ఖాతాలో ఏకంగా రూ.11.7 వేల కోట్లు కనిపించాయి. దాంతో గుండె ఆగినంత పనైంది రమేష్కు. అయితే ఆ షాక్ నుంచి తేరుకొని, వెంటనే ఒక రెండు కోట్ల రూపాయలు పెట్టి షేర్లు కొనేశాడు.
గంటల వ్యవధిలోనే రూ.5 లక్షలపైగా లాభం చవిచూశాడు. అయితే అదే రోజు రాత్రికి అతని అకౌంట్లో డబ్బులన్నీ మాయమయ్యాయి. ఈ ఘటన గుజరాత్లో వెలుగు చూసింది. ఏడాది క్రితం తను కోటక్ సెక్యూరిటీస్లో డీమ్యాట్ ఖాతా తీసుకున్నానని రమేష్ చెప్పాడు.
‘జులై 26న నా ఖాతాలో సడెన్గా రూ.116,77,24,43,277.10 కనిపించాయి. వాటిలో రెండు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి రూ.5 లక్షల వరకు లాభం సంపాదించా. అదే రోజు రాత్రి 8-8.30 గంటల సమయంలో అకౌంట్లో డబ్బులన్నీ పోయాయి’ అని రమేష్ వెల్లడించాడు.
‘యాప్లో మార్జిన్ అప్డేట్స్లో సమస్య వల్లే ఇలా జరిగింది. మీరు ఆర్డర్లు పెట్టుకునేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీకు కనిపించిన మార్జిన్ అప్డేట్ అవదు. ఈ ఇబ్బంది కలిగినందుకు చాలా చింతిస్తున్నాం’ అంటూ కోటక్ సెక్యూరిటీస్ నుంచి రమేష్కు మెసేజ్ వచ్చింది. ఇలా ఆ రోజున చాలా మందికి జరిగిందని, ఆ తర్వాత అందరి ఖాతాల్లో ఆ భారీ సొమ్ము మాయమైందని తెలుస్తోంది. ఈ విషయంపై బ్యాంకు అధికారులెవరూ స్పందించకపోవడం గమనార్హం.