అహ్మదాబాద్, నవంబర్ 17: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్ రెడ్డి, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిఖిల్ కరియాల్ను పాట్నా హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేయడంపై వివాదం రేగింది. ఈ నిర్ణయంపై తెలంగాణ, గుజరాత్ హైకోర్టుల బార్ అసోసియేషన్లు నిరసన వ్యక్తం చేశాయి. గురువారం విధులను బహిష్కరించాయి.
తెలంగాణ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వి రఘునాథ్ మాట్లాడుతూ.. జస్టిస్ అభిషేక్రెడ్డి బదిలీ ఏకపక్షమని వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతపై ఇది ప్రభావం చూపుతుందని అన్నారు. జడ్జిల బదిలీకి ఎలాంటి మార్గదర్శకాలు లేవని పేర్కొన్నారు. ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని సుప్రీంకోర్టు కొలీజియానికి విజ్ఞప్తి చేశారు. బదిలీని వ్యతిరేకిస్తూ లాయర్లు నిరసన ర్యాలీ చేపట్టారు.