అహ్మదాబాద్: జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యింది. దీంతో ఈ పరీక్ష వాయిదా పడింది. అలాగే పేపర్ లీక్కు సంబంధించి 15 మంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ పాలిత గుజరాత్లో ఈ సంఘటన జరిగింది. పంచాయతీ జూనియర్ క్లర్క్ రిక్రూట్మెంట్ పరీక్ష ఆదివారం ఉదయం జరుగాల్సి ఉంది. 1,181 పోస్టులకు సుమారు 9.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. గుజరాత్ వ్యాప్తంగా 2,995 కేంద్రాల్లో ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఈ పరీక్షను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
కాగా, ఈ పేపర్ లీక్ గురించి గాంధీనగర్లోని గుజరాత్ పంచాయితీ సర్వీస్ సెలక్షన్ బోర్డ్కు సమాచారం అందింది. దీంతో ఇసామ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద పరీక్ష ప్రశ్నాపత్రం కాపీ ఉన్నట్లు గుర్తించారు. దీంతో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) రంగంలోకి దిగింది. పేపర్ లీక్కు సంబంధించి 15 మందిని వడోదరలో అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఐదుగురు గుజరాత్కు చెందిన వారు కాగా, పది మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు.
మరోవైపు పేపర్ లీక్పై గుజరాత్ పంచాయితీ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ స్పందించింది. ఆదివారం జరుగాల్సిన ఈ పరీక్షను వాయిదా వేసినట్లు ప్రకటించింది. పరీక్ష తిరిగి నిర్వహించే తేదీని త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. అయితే పరీక్ష వాయిదా విషయం తెలుసుకున్న అభ్యర్థులు పలు ఎగ్జామ్ సెంటర్స్ వద్ద ఆందోళనకు దిగారు. పేపర్ లీక్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.