న్యూఢిల్లీ, జూలై 2: గత మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెగని వర్షాలతో గుజరాత్ తడిసిముద్దవుతున్నది. దీంతో వేలాది గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయని, భారీ వర్షాలు, వరదల తాకిడికి రోడ్లు తెగిపోతున్నాయని ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆదివారం మీడియాకు తెలిపారు. ధరంపూర్లో 24 గంటల వ్యవధిలో 234 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదివారం ఉదయం నుంచి వల్సాద్, నవసారి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ముఖ్యంగా జామ్నగర్ జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక ప్రాంతాలు నీట మునగటంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. మూడు రోజుల్లో వివిధ చోట్ల జరిగిన ప్రమాద ఘటనల్లో 11మంది చనిపోయారని జామ్నగర్ పోలీసులు వెల్లడించారు. ఈ నెల 8 నాటికి దేశ వ్యాప్తంగా నైరుతి రుతు పవనాలు విస్తరిస్తాయని ఐఎమ్డీ తొలుత అంచనా వేసింది. అయితే ఆరు రోజుల ముందుగానే రుతు పవనాలు చురుగ్గా విస్తారించాయి.