అహ్మదాబాద్, జూలై 1: ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కేసులో గుజరాత్ హైకోర్టు ఆదేశంపై వారం పాటు స్టే విధిస్తూ సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం శనివారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది.‘తీర్పును సవాల్ చేసేందుకు ఆమెకు కొంత సమయం ఇవ్వాల్సింది’ అంటూ గుజరాత్ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తీరును తప్పు బట్టింది. దీనికంటే ముందు శనివారం ఉదయం గుజరాత్ హైకోర్టు బెయిల్ పిటిషన్పై విచారణ జరిపింది. పిటిషన్ను తిరస్కరిస్తూ, వెంటనే లొంగిపోవాలని ఆదేశాలు జారీచేసింది. దీంతో ఆమె అరెస్టు అనివార్యమైంది. ఈనేపథ్యంలో నాటకీయ పరిణామాల నడుమ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తొలుత ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం వెకేషన్ బెంచ్ బెయిల్ పిటిషన్పై ఎటూ తేల్చుకోలేకపోయింది. విషయం సీజేఐ డీవై చంద్రచూడ్ వద్దకు చేరగా, త్రిసభ్య ధర్మాసనానికి కేటాయించారు. 2002 గోద్రా ఘటన అనంతరం గుజరాత్ అల్లర్ల కేసులకు సంబంధించి దర్యాప్తు బృందాలకు, పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారని గతంలో సెతల్వాద్పై ఆరోపణలు వచ్చాయి. అమాయక పౌరులను కేసులో ఇరికించేందుకు తప్పుడు సాక్ష్యాల్ని సృష్టించారని ఆమెపై అభియోగాలు నమోదయ్యాయి.