అహ్మాదాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) డిగ్రీ సర్టిఫికేట్(degree certificate) కేసులో.. గుజరాత్ హైకోర్టు(Gujrat High Court) ఇవాళ తీర్పును వెలువరించింది. ప్రధాని మోదీకి చెందిన డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ సర్టిఫికేట్లను ప్రధానమంత్రి కార్యాలయం(PMO) బహిర్గతం చేయాల్సి అవసరం లేదని గుజరాత్ హైకోర్టు తన తీర్పులో వెల్లడించింది. జస్టిస్ బీరెన్ వైష్ణవ్(Justice BirenVaishnav) నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.
గుజరాత్ యూనివర్సిటీతో పాటు ఢిల్లీ యూనివర్సిటీలు ప్రధాని మోదీ డిగ్రీ, పీజీ సర్టిఫికేట్లను సమర్పించాలని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్(CIC) ఇచ్చిన ఆదేశాలను సింగిల్ జడ్జి బెంచ్ కొట్టిపారేసింది. ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(CM Kejriwal)కు కోర్టు జరిమానా విధించింది. ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికేట్ కావాలంటూ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఆయనకు 25వేల జరిమానా విధిస్తున్నట్లు గుజరాత్ హైకోర్టు తెలిపింది.
సీఐసీ ఇచ్చిన ఆదేశాలను గుజరాత్ యూనివర్సిటీ.. ఆ రాష్ట్ర హైకోర్టులో సవాల్ చేసింది. ప్రధాని మోదీ ఇచ్చిన సమాచారం మేరకు.. 1978లో గుజరాత్ యూనివర్సిటీ నుంచి మోదీ తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఇక 1983లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఆయన పీజీ పూర్తి చేశారు. ఈ కేసులో యూనివర్సిటీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. దీంట్లో దాచిపెట్టడానికి ఏమీలేదని, కానీ వర్సిటీని వత్తిడి చేయడం సరికాదన్నారు.