గాంధీనగర్, నవంబర్ 24: గుజరాత్లో మోర్బీ వంతెన కూలిన ఘటనలో బాధితులకు గుజరాత్ సర్కారు ప్రకటించిన పరిహారంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. ఈ దుర్ఘటనలో మృతిచెందినవారి కుటుంబీకులకు ప్రకటించిన పరిహారం చాలా తక్కువని అభిప్రాయపడింది. గాయపడినవారికి కూడా అతి తక్కువ పరిహారం ప్రకటించడంపై గుజరాత్ సర్కారుకు అక్షింతలు వేసింది. పరిహారం అనేది వాస్తవికంగా ఉండాలని, తగిన నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.
‘తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులకు నెలకు రూ.3వేల సాయం చాలా తక్కువ. ఆ డబ్బులు వారికి యూనిఫాం, పుస్తకాల కొనుగోలుకు కూడా సరిపోవు’ అని ధర్మాసనం పేర్కొంది. మచ్చునదిపై నిర్మించిన బ్రిటిష్కాలంనాటి సస్పెన్షన్ బ్రిడ్జి అక్టోబర్ 30న కుప్పకూలింది. ఈ ఘటనలో 130 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. చాలామంది గాయడపడ్డారు.