గాంధీనగర్, మార్చి 27: గుజరాత్ బీజేపీ ప్రభుత్వం అదానీ సంస్థల నుంచి కొనుగోలు చేసే విద్యుత్తు ధరను రెండేండ్లలోనే అడ్డగోలుగా పెంచింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర విద్యుత్తు మంత్రి దేశాయ్ సోమవారం అసెంబ్లీలో వెల్లడించారు. 2021, 2022లో ప్రభుత్వం విద్యుత్తు కొనుగోలుకు అదానీ పవర్, టాటా పవర్కు రూ.16,900 కోట్లు చెల్లించిందని తెలిపారు. ఇందులో అదానీ పవర్ ముంద్ర లిమిటెడ్కు రూ.8,160 కోట్లు, కోస్టల్ గుజరాత్ పవర్ లిమిటెడ్కు రూ.8,784 కోట్లు చెల్లించినట్టు తెలిపారు.
2021 జనవరిలో అదానీ నుంచి ఒక యూనిట్ను రూ.2.83కు కొన్న గుజరాత్ ప్రభుత్వం 2022 డిసెంబర్ నాటికి రూ.8.83 చెల్లిస్తున్నది. టాటా పవర్కు చెల్లిస్తున్న ధరను యూనిట్కు రూ.1.80 నుంచి రూ.4.92కు పెంచింది. అదానీ నుంచి 2021లో 5,589 మిలియన్ యూనిట్ల కొనుగోలుకు రూ.2,760 చెల్లించిన గుజరాత్ ప్రభుత్వం, 2022లో 6,000 మిలియన్ యూనిట్లకే రూ.5,400 కోట్లు చెల్లించింది.
అధిక పెంపును ప్రస్తావిస్తూ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ‘విద్యుత్తు ధరను యూనిట్కు రూ.11 నుంచి రూ.1కి తగ్గించానని మోదీ చెప్పుకుంటారు. దేశానికి ఇంత అబద్ధాల ప్రధానిని ఎన్నడూ లేరు’ అని ట్వీట్ చేశారు. మోదీపైన గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల వీడియోను జత చేశారు.