అహ్మదాబాద్ : వచ్చే నెలలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేషనలిస్ట్ కాంగ్రెస్తో కాంగ్రెస్ పార్టీ పొత్తు కుదుర్చుకున్నది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ రాష్ట్రంలోని మొత్తం 182 స్థానాల్లో మూడింటిలో పోటీ చేయనున్నది. ఈ మేరకు శుక్రవారం రెండు పార్టీలు సంయుక్తంగా ప్రకటన చేశాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్ ఎన్నికల్లో రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. ఎన్సీపీకి చెందిన కంధాల్ జడేజా ఆ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే నిలిచారు. ఆయన పోర్బందర్ జిల్లాలోని కుటియానా అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు.
ఎన్సీపీతో కలిసి పోటీ చేయనున్నట్లు గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీశ్ ఠాకూర్ తెలిపారు. ఉమ్రేత్ (ఆనంద్ జిల్లా), నరోడా (అహ్మదాబాద్), డియోగర్ (దహోద్ జిల్లా) స్థానాల్లో ఎన్సీపీ పోటీ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ 125 సీట్లు గెలుపొంది మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్సీపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు జయంత్ పటేల్ బోస్కీ విలేకరులతో మాట్లాడుతూ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్కు ఎన్సీపీ మద్దతు ఇస్తుందని చెప్పారు. ఇదిలా ఉండగా.. బీజేపీ పాలిత గుజరాత్లో డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగనుండగా.. 8న లెక్కింపు నిర్వహించనున్నారు.