బనస్కాంత: బీజేపీ గూండాల దాడి నుంచి తప్పించుకుని తాను ప్రాణాలు కాపాడుకున్నానని గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కంటిభాయ్ ఖరాడీ వెల్లడించారు. బనస్కాంత జిల్లాలోని ఎస్టీ రిజర్వ్డ్ స్థానం డాంటా నుంచి ఆయన గుజరాత్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆదివారం ఖరాడీపై బీజేపీ గూండాలు దాడికి పాల్పడ్డారని, ఆ తర్వాత ఆయన కనిపించకుండా పోయారని, బీజేపీ గుండాలే ఖరాడీని కిడ్నాప్ చేసి ఉంటారని కాంగ్రెస్ ఆరోపించింది.
ఈ క్రమంలో సోమవారం ఉదయం ఖరాడీ మీడియా ముందుకు వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఆదివారం రాత్రి తాను తన నియోజకవర్గంలోని ఓటర్లను కలిసేందుకు అనుచరులతో వెళ్తుండగా బీజేపీ అభ్యర్థి లటు పర్ఘి అతని మనుషులు మమ్ముల అడ్డగించారని, వారి నుంచి తప్పించుకునేందుకు తమ వాహనాలను వెనక్కి తిప్పుకుని వెళ్తుండగా దాదాపు 15 కిలోమీటర్లు వెంబడించారని, ముందు నుంచి అతని మనుషులు వచ్చి తమను ఆపేశారని చెప్పారు.
దాంతో తాము దొరికిపోయామని, ఆ సమయంలో తనపైనా, తన మనుషులపై ఇష్టం వచ్చినట్లు దాడికి పాల్పడ్డారని ఆయన చెప్పారు. దాంతో ఎలాగోలా వారి నుంచి తప్పించుకుని చీకట్లో రోడ్డు దిగి కొన్ని కిలోమీటర్లు పరుగులు తీశామని తెలిపారు. తాము తప్పించుకుని ఉండకపోతే వాళ్లు తన ప్రాణాలు తీసేవారని చెప్పారు. లటు పర్ఘీ బెదిరింపుల గురించి ముందే ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఖరాడీ ఆరోపించారు.