అహ్మదాబాద్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలు గుప్పిస్తూ కాంగ్రెస్ అభ్యర్ధి ధర్నా చేపట్టారు. మెడ చుట్టూ కండువాను బిగించి నిరసన తెలపడంతో ఈసీ అధికారులు, సిబ్బంది వారించారు. గాంధీధాం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసిన భరత్భాయ్ వెల్జిభాయ్ సోలంకి ఈసీ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
బీజేపీ అభ్యర్ధి మాలతి కిషోర్ మహేశ్వరిపై సోలంకి 12,000 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. కాగా, కొన్ని ఈవీఎంలకు సీల్ సరిగ్గా లేదని కాంగ్రెస్ అభ్యర్ధి ఆక్షేపించారు. తొలుత సోలంకి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. ఆపై కండువాతో మెడ చుట్టూ ఉచ్చు బిగించుకుని నిరసన తెలిపారు.
ఈవీఎంల ట్యాంపరింగ్పై తాను అభ్యంతరాలను లేవనెత్తినా అధికారులు పట్టించుకోలేదని సోలంకి మండిపడ్డారు. ఇక గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 155 స్ధానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతుండగా కాంగ్రెస్ 18 స్ధానాల్లో, ఆప్ 6 స్ధానాల్లో, ఇతరులు 3 స్ధానాల్లో ముందంజలో ఉన్నాయి.