జీఎస్టీలో విప్లవాత్మకమైన సవరణలు తీసుకొచ్చి పేద, మధ్యతరగతి వర్గాలకు ఊరట కలిగించామని కేంద్రంలోని ఎన్డీయే సర్కారు గొప్పలకు పోతున్నది. నిజానికి ప్రభుత్వ తాజా నిర్ణయాలతో సామాన్యులకు ఒరిగిందేమీ లేదన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): జీఎస్టీలో (వస్తు, సేవల పన్ను) విప్లవాత్మకమైన సవరణలు తీసుకొచ్చి పేద, మధ్యతరగతి వర్గాలకు ఊరట కలిగించామని కేంద్రంలోని ఎన్డీయే సర్కారు గొప్పలకు పోతున్నది. నిజానికి ప్రభుత్వ తాజా నిర్ణయాలతో సామాన్యులకు ఒరిగిందేమీ లేదన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. పిల్లల స్కూల్ ఫీజుల విషయానికే వస్తే, జీఎస్టీ తాజా సవరణలతో స్కూల్ ఫీజుల భారం, టెక్ట్స్బుక్స్ రేట్లు అమాంతం పెరిగే ప్రమాదం ఉన్నదని ఆర్థిక విశ్లేషకులు చెప్తున్నారు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం తీసుకొనే కోచింగ్, ఆన్లైన్ క్లాసులు, ట్యూషన్ ఫీజుల్లో కూడా ఏ మాత్రం ఊరట దక్కలేదని వివరిస్తున్నారు.
స్కూల్, కాలేజీల ఫీజులపై ఎలాంటి జీఎస్టీ భారం ఉండదని పైకి చెప్తున్న కేంద్రప్రభుత్వం.. పాఠశాల నిర్వహణ ఖర్చులపై మాత్రం ట్యాక్సుల మోత మోగించింది. సప్లిమెంటరీ ఎడ్యుకేషన్ కిందకు వచ్చే స్కూల్లో వినియోగించే ఐటీ సేవలు, క్లీనింగ్, సెక్యూరిటీ, మెయింటెనెన్స్, డెవలప్మెంట్ తదితరాలపై గతంలో 12 శాతంగా ఉన్న జీఎస్టీని ఇప్పుడు 18 శాతానికి పెంచింది. ప్రస్తుతం ట్యూషన్ ఫీజుతో పాటు సెక్యూరిటీ, స్కూల్ డెవలప్మెంట్, టెక్, ల్యాబ్ సర్వీసులు ఇలా అన్నింటినీ కలిపి స్కూల్ ఫీజుగా యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయి. తాజాగా సప్లిమెంటరీ ఎడ్యుకేషన్పై కేంద్రం జీఎస్టీని పెంచడంతో పిల్లల స్కూల్ ఫీజులు మరింతగా పెరిగే ప్రమాదం ఉన్నదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ యాజమాన్యాలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ని క్రెడిట్ చేసుకోలేవు కాబట్టి, ఈ పెరిగిన ఖర్చులు ఫీజుల రూపంలో విద్యార్థుల తల్లిదండ్రులకు అదనపు భారాన్ని మిగల్చడం ఖాయమని విద్యావేత్తలు చెప్తున్నారు.
నోట్బుక్స్పై జీఎస్టీని ఎత్తేసిన కేంద్రం.. టెక్ట్స్బుక్స్, ప్రింటెడ్ స్టడీ మెటీరియల్పై మాత్రం 12 శాతంగా ఉన్న జీఎస్టీని 18 శాతానికి పెంచింది. దీంతో స్కూల్ పిల్లల టెక్ట్స్బుక్స్, కోచింగ్కు ప్రిపేరయ్యే విద్యార్థుల స్టడీ మెటీరియల్ ధరలకు రెక్కలు రానున్నాయి. కేంద్రం తాజా నిర్ణయంతో టెక్ట్స్బుక్స్, మెటీరియల్ ధరలు 10 శాతం నుంచి 15 శాతం మేర పెరిగే ప్రమాదం ఉన్నదని ది ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ (ఓపీఏ) జనరల్ సెక్రటరీ ప్రొఫెసర్ కమల్ మోహన్ చోప్రా అభిప్రాయపడ్డారు. ఇది దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది విద్యార్థులపై, వారి కుటుంబ సభ్యులపై ఆర్థిక భారాన్ని మోపుతుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై కేంద్రం పునరాలోచించాలని డిమాండ్ చేశారు.
ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు, ట్యూషన్లు, ఆన్లైన్ కోర్సులు-లెర్నింగ్ ప్లాట్ఫాంలపై జీఎస్టీని కేంద్రం 18 శాతంగానే కొనసాగించింది. దీంతో జేఈఈ, నీట్, సివిల్స్, సాఫ్ట్వేర్ కోర్సుల్లో చేరాలనుకొనే వారికి, ఆన్లైన్ లెర్నింగ్, క్లాసులు వినే విద్యార్థులకు ఫీజుల విషయంలో ఊరట దక్కలేదనే చెప్పాలి. ఉదాహరణకు.. జేఈఈ లేదా నీట్ కోచింగ్ కోసం ఒక విద్యార్థి రూ. 50 వేలు ఫీజు కడితే, దానికి జీఎస్టీ రూపంలో రూ. 9 వేల వరకూ అదనంగా చెల్లించాల్సిందే. ఇది మధ్యతరగతి కుటుంబాలకు పెను భారమేనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం తీసుకొన్న నిర్ణయాలపై పునరాలోచన చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.