న్యూఢిల్లీ : వస్తు సేవల పన్నుల (GST) వసూళ్లు రికార్డు స్థాయిలో వసూలయ్యాయి. మార్చి నెలలో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత వరుసగా ఆరోసారి జీఎస్టీ వసూళ్లు 1.30లక్షల కోట్ల మార్క్ను దాటాయి. గత మార్చిలో ఏకంగా జీవితకాల గరిష్ఠానికి చేరుకొని.. ఏకంగా 1.42లక్షల కోట్ల రాబడి వచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. గత ఏడాది ఇదే నెలతో పోల్చితే 15 శాతం వృద్ధి నమోదైందని పేర్కొంది. ఫిబ్రవరిలో జీఎస్టీ వసూళ్లు రూ.1,33,026 కోట్లు.
మొత్తం వసూళ్లలో సీజీఎస్టీ రూ.25,830 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.32,378 కోట్లు, ఐజీఎస్టీ రూ.74,470 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ.39,131 కోట్లతో కలిపి), సెస్ రూ.9,417 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ.981 కోట్లతో కలిపి) వసూలయ్యాయని ఆర్థికశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణతోపాటు పన్ను ఎగవేత నిరోధక చర్యలు ఫలిస్తుండటంతో వసూళ్లు పెరిగాయని, రేట్ల హేతుబద్దీకరణ సైతం దోహదం చేస్తోందని ఆర్థిక శాఖ పేర్కొంది. ఇకపై రాబోయే నెలల్లో జీఎస్టీ వసూళ్లూ అనూహ్యంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.