మధ్యప్రదేశ్లోని గ్రామంలో దుస్థితి
కట్నీ, మే 17: మధ్యప్రదేశ్లోని కట్నీ జిల్లాలో ఉన్న ఖూస్రా గ్రామంలో అబ్బాయిలకు పిల్లనివ్వడానికి చుట్టు పక్కల ఊర్లవాళ్లు భయపడతారు. ఎందుకంటే తాగునీటి కోసం ఆ ఊళ్లో వాళ్లు కిలోమీటర్ల దూరం నడవాలి.
ఊర్లో ఏ ఒక్క ఇంటికి నల్లా కనెక్షన్ లేదు. బోర్లు వేసినా చుక్క నీళ్లు లేవు. ఊరికి ఆవల కిలోమీటర్ల దూరంలో ఎక్కడో అడవిలో ఉన్న చిన్న నీటి కాలువే ఖూస్రా గ్రామ ప్రజలకు ఆధారం. గ్రామంలో ప్రతీ ఇంట్లో ఒకరికి ఇక్కడి నుంచి నీళ్లు తీసుకురావడమే పని. గుక్కెడు నీళ్ల కోసం కూడా కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తుందని, ఏండ్లుగా కష్టపడుతున్నామని సర్పంచ్ నేన్సింగ్ ఠాకూర్ చెప్పారు.