Wireless Jammers | వైర్లెస్ జామర్లు.. ఫోన్కాల్స్పై నిఘా పెట్టడానికి ఉపయోగిస్తారు. ఇది వ్యక్తుల ప్రైవసీపై దాడి చేయడమే. దేశ భద్రత, జాతికి నష్టం కలిగించే వారిపై నిఘా పెట్టేందుకు పోలీసులు, దర్యాప్తు సంస్థలు వైర్లెస్ జామర్లు ఉపయోగిస్తాయి. అందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కూడా తప్పనిసరి తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఈ-కామర్స్ సంస్థల నుంచి ఇబ్బడిముబ్బడిగా వైర్లెస్ జామర్ల కొనుగోళ్లు జరుగుతున్నాయి. వైర్లెస్ జామర్లతోపాటు జీపీఎస్ బ్లాకర్, ఇతర సిగ్నల్ జామింగ్ పరికరాలనూ ఈ-కామర్స్ సంస్థల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. దీనిపై కేంద్రం మరోసారి అప్రమత్తమైంది. చట్ట విరుద్ధంగా వైర్లెస్ జామర్ల విక్రయాలు, పంపిణీ, వాటిపై వాణిజ్య ప్రకటనలు జారీ చేయొద్దని కేంద్ర టెలీ కమ్యూనికేషన్ల శాఖ (డీవోటీ) సోమవారం హెచ్చరికలు జారీ చేసింది.
`భారత్లో ప్రైవేట్ రంగ సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులు జామర్లను కొనుగోలు చేయడం గానీ, వాడటం గానీ చేయరాదు` అని కేంద్ర టెలీ కమ్యూనికేషన్ల శాఖ స్పష్టం చేసింది. భారత్లో జామర్ల మార్కెటింగ్, దిగుమతి, వాణిజ్య ప్రకటనలు చేయడం, పంపిణీ చేయడం చట్ట విరుద్ధం అని తెలిపింది. లైసెన్స్డ్ టెలికం సర్వీస్ సంస్థ మినహా ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు మొబైల్ సిగ్నల్ రీపీటర్, బూస్టర్ కలిగి ఉండరాదని, కొనుగోలు చేయరాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అనుమతితోనే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, రక్షణ బలగాలు, కేంద్ర పోలీసు సంస్థలు, ఇతర దర్యాప్తు సంస్థలు మాత్రమే జామర్లు కొనుగోలు చేసి వాడుతున్నాయి.