న్యూఢిల్లీ : ఆందోళన బాటపట్టిన రైతులు లేవనెత్తిన ఇతర పెండింగ్ అంశాలపై సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీకి కేంద్ర ప్రభుత్వం పంపిన ముసాయిదా ప్రతిపాదనపై కమిటీ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ప్రభుత్వం తాజా ప్రతిపాదన పంపింది. ప్రభుత్వం పంపిన తాజా ప్రతిపాదనపై కమిటీ చర్చిస్తోందని కమిటీ సభ్యులు అశోక్ ధవలే తెలిపారు. ప్రభుత్వం ముందుగా పంపిన ప్రతిపాదనలో లోటుపాట్లు ఉండటంతో వాటికి సవరణలు సూచిస్తూ మంగళవారం రాత్రి దాన్ని తిరిగి ప్రభుత్వానికి పంపామని చెప్పారు.
కాగా తాజా ప్రతిపాదన పట్ల కూడా కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. వివాదాస్పద సాగు చట్టాలను ఉపసంహరించినా పెండింగ్ అంశాలపై ప్రభుత్వం నిర్ధిష్ట హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని రైతు సంఘాల ప్రతినిధులు తేల్చిచెప్పారు. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు చట్టబద్ధత కల్పించడం, విద్యుత్ సవరణల బిల్లు ఉపసంహరణ, రైతులపై నమోదైన కేసుల రద్దు, రైతుల నిరసనలో మరణించిన అన్నదాతల కుటుంబాలకు పరిహారం చెల్లింపు వంటి అంశాలను ప్రధానంగా రైతు సంఘాలు కేంద్రం ముందుంచాయి.
తాము ఆందోళన విరమించిన తర్వాతే తమపై ఉన్న కేసులను ఎత్తివేస్తామని ప్రభుత్వం చెప్పడం సరైంది కాదని, ఎముకలు కొరికే చలిలో ఇక్కడ కూర్చోవాలని తాము కోరుకోవడం లేదని రైతు సంఘాల కమిటీ సభ్యుడు అశో్క్ ధవలే పేర్కొన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు రైతులు చేపట్టిన నిరసనల్లో మరణించిన రైతుల కుటుంబసభ్యులకు పరిహారం చెల్లింపులో కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించిందని, అయితే దీనిపై నిర్ధిష్ట చర్యలు అవసరమని ఆయన స్పష్టం చేశారు.