న్యూఢిల్లీ: డిజిటల్ న్యూస్ కంటెంట్ ప్రసారం, ప్రచురణలో సోషల్ మీడియాతోపాటు ప్రధాన స్రవంతి మీడియాకు కేంద్రం అమలులోకి తెచ్చిన నూతన ఐటీ నిబంధనలు వర్తిస్తాయి. 2021 ఐటీ నిబంధనల అమలు నుంచి టెలివిజన్ చానెళ్లు, ప్రింట్ మీడియా సంస్థలకు మినహాయింపునిచ్చేందుకు కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ నిరాకరించింది.
తక్షణం డిజిటల్ మీడియా నిబంధనలను అమలు చేయడానికి అత్యవసర చర్యలు తీసుకోవాలని టీవీ చానెళ్లు, ప్రింట్ మీడియా సంస్థలను ఆదేశించింది.
సంప్రదాయ మీడియా (టీవీ అండ్ ప్రింట్)లను ఐటీ నిబంధనల నుంచి మినహాయిస్తే డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్పై వివక్షా పూరితమేనని కేంద్ర సమాచార, ప్రసారాలశాఖ పేర్కొంది. దీనికి అనుగుణంగా ఇప్పటికే 500కి పైగా మీడియా సంస్థలు ఐటీ నిబంధనలను అమలు చేస్తామని కేంద్రానికి నివేదిక సమర్పించాయి.
ఇటీవలే నేషనల్ బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ (ఎన్బీఏ).. సంప్రదాయ టెలివిజన్ న్యూస్ చానెళ్లను 2021 ఐటీ రూల్స్ నుంచి మినహాయించాలని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖను కోరింది. ఇప్పటికే ప్రింట్, టీవీ మీడియా సంస్థలపై సరైన నియంత్రణ చర్యలు అమలులో ఉన్నాయని పేర్కొన్నది.