న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: యూపీఐ పేమెంట్ వ్యవస్థ నిర్వహణ కోసం అన్ని యూపీఐ లావాదేవీలపై కేంద్రం 0.3 శాతం ఫీజు విధించే అవకాశం ఉంది. యూపీఐ నిర్వహణపై ఐఐటీ బాంబే ఒక అధ్యయనం చేసి నివేదిక సమర్పించింది. యూపీఐ లావాదేవీలపై ఫెసిలిటేషన్ ఫీజు కింద 0.3 శాతం తీసుకోవాలని ప్రతిపాదించింది. ఈ ఫీజు ద్వారా 2023-24లో రూ.5,000 కోట్లు సమకూరుతుందని పేర్కొంది. ఈ ప్రతిపాదనను కేంద్రం పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. గత కొన్నేండ్లుగా కేంద్రం కరెన్సీ నోట్ల ముద్రణ కోసం ఏటా సగటున రూ.5,400 కోట్లు ఖర్చు చేస్తున్నది. ఈ ఖర్చు కంటే యూపీఐ వ్యవస్థ నిర్వహణ ఖర్చు తక్కువగా ఉంటుందని ఐఐటీ బాంబే నివేదించింది. కాగా, ఇప్పటికే వ్యాపార లావాదేవీలపై 1.1 శాతం ఇంటర్ఛేంజ్ ఫీజును ఏప్రిల్ 1 నుంచి విధిస్తున్న సంగతి తెలిసిందే.