న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియాపై ప్రభుత్వం ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. బిడ్డింగ్లో తుది విజేతను నిర్ధేశిత ప్రక్రియను అనుసరించి ఎంపిక చేస్తారని స్పష్టం చేశారు. తాను నిన్నటి నుంచి దుబాయ్లో ఉన్నానని, ఎయిర్ ఇండియా విక్రయంపై తుది నిర్ణయం జరిగిందని తాను అనుకోవడం లేదని చెప్పారు. బిడ్లను ఆహ్వానించామని, వాటి పరిశీలన జరుగుతోందని, నిర్ధేశిత ప్రక్రియకు అనుగుణంగా ఎయిర్ ఇండియాను దక్కించుకునే తుది విజేతను ఎంపిక చేస్తారని మొత్తం ప్రక్రియను వివరిస్తూ కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
ఎయిర్ ఇండియాను టాటాలు కైవసం చేసుకుంటారా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎయిర్ ఇండియా రేసులో టాటాలు టాప్ బిడ్డర్గా నిలిచారు. కాగా ఎయిర్ ఇండియాకు సంబంధించి ప్రభుత్వం ఇంతవరకూ ఎలాంటి ఫైనాన్షియల్ బిడ్కు ఆమోదం తెలపలేదని ప్రైవేటీకరణ ప్రక్రియను పర్యవేక్షించే పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు.