చండీగఢ్: రానున్న లోక్సభ ఎన్నికల్లో గెలవడంపైనే కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని, రైతుల డిమాండ్లను పట్టించుకోవడం లేదని రైతు సంఘం నేత సర్వణ్ సింగ్ పంధేర్ శుక్రవారం ఆరోపించారు. ఎంఎస్పీకి చట్టపరమైన హామీ ఇవ్వాలని, రైతుల డిమాండ్లపై దృష్టి సారించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేరే వరకు తమ నిరసన కొనసాగుతుందని స్పష్టం చేశారు. రైతుల ‘ఢిల్లీ చలో’ కవాతుకు సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చా నాయకత్వం వహిస్తున్నాయి. ఖనౌరీ సరిహద్దుల్లో ఫిబ్రవరి 21న జరిగిన ఘర్షణల్లో రైతు శుభ్కరణ్ సింగ్(21) మరణించడంతోపాటు 12 మంది పోలీసులు గాయపడిన నేపథ్యంలో ధర్నాకు తాత్కాలిక విరామం ప్రకటించారు.
ఫిబ్రవరి 21న ఖనౌరీ సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో మరణించిన రైతు శుభ్కరణ్ (21) తలలో తూటా గాయం ఉన్నట్లు శవపరీక్ష నివేదిక వెల్లడించింది. ఆయన పుర్రెలో లోహపు పెల్లెట్లు ఉన్నాయని పాటియాలా హాస్పిటల్ తెలిపింది. గాయపడిన రైతుల శరీరాల్లో కూడా ఇటువంటి పెల్లెట్లు కనిపించాయని చెప్పింది. పెల్లెట్లను నిపుణులకు పంపించి, ఎటువంటి తుపాకీతో వీటిని ప్రయోగించారో తెలుసుకుంటారని సమాచారం.