న్యూఢిల్లీ, నవంబర్ 17: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాదిపాటు పొడిగించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీచేసింది. వచ్చే ఏడాది నవంబర్ 18 వరకు ఆయన పదవిలో కొనసాగనున్నారు.
తాజా పొడిగింపుతో ఆయన ఐదేండ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకోనున్నారు. తొలిసారిగా 2018 నవంబర్ 19న రెండేండ్ల పదవీకాలానికి ఆయన ఈడీ డైరెక్టర్గా నియమితులయ్యారు. అనంతరం 2020 నవంబర్ 13న కేంద్రం ఆ ఉత్తర్వులను సవరిస్తూ పదవీకాలాన్ని మూడేండ్లుగా మార్చింది. కేంద్ర దర్యాప్తు సంస్థల పదవీకాలాన్ని మూడేండ్లపాటు పొడిగించేలా కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఆర్డినెన్స్ను తీసుకొచ్చింది. తదనంతరం మిశ్రా పదవీకాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగించింది.