EPFO : ఈపీఎఫ్వో ఖాతాదారులకు తీపి కబురు అందింది. ఖాతాదారుల డిపాజిట్లపై ఈపీఎఫ్ఓ 2022-23 ఆర్థిక ఏడాదికిగానూ 8.15 శాతం వడ్డీ రేటును చెల్లించనుంది. గత ఆర్థిక సంవత్సరం 8.10 శాతం కంటే ఇది 5 బేసిస్ పాయింట్లు ఎక్కువ. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈ ఏడాది మార్చి 28న 8.15 శాతం వడ్డీ రేటును ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదనకు తాజాగా కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు ఒక సర్క్యులర్ను విడుదల చేసింది. ఈపీఎఫ్ సభ్యుల ఖాతాల్లో వడ్డీని జమ చేసే అధికారులకు అవసరమైన సూచనలను ఇవ్వాలని ఆ సర్క్యులర్లో ఆదేశించింది.
కాగా, 8.15 శాతం వడ్డీ రేటుకు ఆమోదంవల్ల దేశవ్యాప్తంగా ఐదు కోట్ల మందికి పైగా వేతన జీవులకు లబ్ధి చేకూరనుంది. ఖాతాదారుల డిపాజిట్లపై 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.15 శాతం వడ్డీ రేటుకు ఆమోదం తెలిపిన ఈపీఎఫ్వో.. గత ఆర్థిక సంవత్సరానికి (2021-22) ఏకంగా 40 బేసిస్ పాయింట్లు తగ్గించి కేవలం 8.10 శాతం వడ్డీ రేటు మాత్రమే ఇచ్చింది. గత నాలుగు దశాబ్దాల్లో ఈపీఎఫ్ ఖాతాలపై ఇదే అతి తక్కువ వడ్డీ రేటు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ డిపాజిట్లపై వడ్డీ రేటు 8.50 శాతంగా ఉన్నది.