సస్పెన్షన్కు గురైన రాజ్యసభ సభ్యుల పార్టీ ఫ్లోర్ లీడర్లతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపనుంది. సోమవారం ఉదయం 10 గంటలకు ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లు సమావేశానికి రావాలని కేంద్రం లేఖలు రాసింది. కాంగ్రెస్, తృణమూల్, సీపీఎం, సీపీఐ, శివసేన పార్టీల ఫ్లోర్ లీడర్లకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి లేఖలు రాశారు. సోమవారం ఉదయం 10 గంటలకు జరిగే సమావేశానికి రావాలని ఫోన్లు కూడా చేసినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నుంచి తనకు ఫోన్ వచ్చిందని, సమావేశానికి రమ్మన్నారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ధృవీకరించారు కూడా. అయితే ఈ సమావేశానికి వెళ్లే ముందు ఉదయం 9:45 నిమిషాలకు కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే గదిలో సమావేశం కావాలని ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయి.
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన రోజునే 12 మంది రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేయడం తీవ్ర సంచలనం రేపింది. వర్షాకాల సమావేశాల్లో అనుచితంగా, హింసాత్మకంగా ప్రవర్తించిన ఎంపీలపై క్రమశిక్షణా చర్యల కింద రాజ్యసభ సస్పెన్షన్ వేటు వేసింది. ఆ సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలని కాంగ్రెస్ సహా పలు పక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.