Play store | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): సర్వీసు ఫీజు చెల్లింపులపై గూగుల్, భారత స్టార్టప్ కంపెనీల మధ్య తలెత్తిన వివాదం ముదురుతుండటంతో కేంద్రం జోక్యం చేసుకొన్నది. ప్లేస్టోర్ నుంచి కొన్ని యాప్స్ను గూగుల్ తొలగించడాన్ని ఈ సందర్భంగా తప్పుబట్టింది. ఇది ఏ మాత్రం సరైన పద్ధతికాదని, యాప్ల డీలిస్టింగ్ను ఎంతమాత్రం అంగీకరించబోమని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. వచ్చేవారం ఇరుపక్షాలతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
దేశ ఆర్థిక వ్యవస్థకు స్టార్టప్లు గుండెకాయ వంటివన్న వైష్ణవ్.. స్టార్టప్ల తలరాతలను బిగ్ టెక్ కంపెనీలు నిర్ణయించకూడదన్నారు. ఫీజు వివాదం నేపథ్యంలో ప్లేస్టోర్ నుంచి శనివారం మరికొన్ని యాప్లను కూడా గూగుల్ తొలగించింది. జాబితాలో నౌకరీ, నౌకరీ రిక్రూటర్, నౌకరీగల్ఫ్, 99ఏకర్స్ తదితర అప్లికేషన్లు ఉన్నాయి. అయితే, కేంద్రం జోక్యం నేపథ్యంలో శనివారం తొలగించిన యాప్స్ను గూగుల్ తిరిగి పునరుద్ధరించింది. కాగా.. ప్లేస్టోర్లో యాప్లు అప్లోడ్ చేస్తున్న వివిధ స్టార్టప్ల నుంచి గూగుల్ ప్రస్తుతం 11-26% ఫీజును సేవా రుసుము కింద వసూలు చేస్తున్నది. యాప్స్ కొనుగోలు, డౌన్లోడ్ పేరిట ఈ మొత్తాన్ని వసూలు చేస్తున్నట్టు పాలసీలో వెల్లడించింది. అయితే సర్వీసు రుసుము ఎక్కువగా ఉండటాన్ని పలు కంపెనీలు సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. తమ ప్లాట్ఫాం ద్వారా ప్రయోజనాలు పొందుతున్నప్పటికీ.. 10 కంపెనీలు ఫీజులను చెల్లించట్లేదని గూగుల్ పేర్కొంది.