న్యూఢిల్లీ, మార్చి 9: ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులను తెగనమ్మే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది. ప్రభుత్వ భూముల నగదీకరణ కోసం నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్ఎల్ఎంసీ) పేరిట స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ) ఏర్పాటుకు బుధవారం కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రైవేటీకరిస్తున్న, మూతబడుతున్న ప్రభుత్వ రంగ సంస్థలు, ఏజెన్సీలకు చెందిన భవనాలు, మిగులు భూముల నిర్వహణ, అమ్మకానికి ఈ కొత్త కంపెనీని బీజేపీ సర్కారు తీసుకొస్తున్నది. ప్రైవేటీకరణ, ఆస్తుల నగదీకరణపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం గ్లోబల్ ఇన్వెస్టర్లను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఆదాయ కోణంలో చూడొద్దు: కేంద్రం
ఎస్పీవీని రూ.5,000 కోట్ల ఆరంభ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్, రూ.150 కోట్ల పెయిడ్-అప్ షేర్ క్యాపిటల్తో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు ఓ అధికారిక ప్రకటన తెలియజేసింది. ‘కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (సీపీఎస్ఈ)లు, ఇతర ప్రభుత్వ ఏజెన్సీల ఆధ్వర్యంలోని భూములు, భవనాలను స్వాధీనం చేసుకుని ఎన్ఎల్ఎంసీ అమ్ముతుంది’ అని పేర్కొన్నది. ఈ ప్రాధాన్యేతర ఆస్తుల అమ్మకంతో వచ్చిన నిధులను ప్రభుత్వ ఖజానాకు తరలిస్తామని చెప్పింది. కాగా, ఈ ఆస్తుల నగదీకరణను కేవలం ఆదాయం కోణంలోనే చూడరాదని, దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహకంగా చూడాలని కేంద్రం చెప్తున్నది. నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ ఆస్తులను విక్రయించి, కొత్త వనరులను ప్రభుత్వం సృష్టిస్తుందని, తద్వారా మరిన్ని పెట్టుబడులకు అవకాశాలను కల్పిస్తామని అంటున్నది. అయితే ప్రభుత్వ సంస్థల భూములు, భవనాలు ఎన్ఎల్ఎంసీకి బదిలీ అయ్యే విధానాలను మాత్రం కేంద్రం
వివరించలేదు.
ప్రధాని కీలక ప్రసంగం
ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణ, ఆస్తుల నగదీకరణపై ఇన్వెస్టర్లను ఉద్దేశించి గురువారం ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఈ వెబినార్లో అమెరికా, ఆస్ట్రేలియా, ఐరోపా దేశాలకు చెందిన ఇన్వెస్టర్లు, కేంద్రమంత్రులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారు.