Kapil Sibal : తమిళనాడు (Tamil Nadu) లో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబాల్ (Kapil Sibal) తనదైన శైలిలో స్పందించారు. గవర్నర్ల వ్యవస్థను బీజేపీ (BJP) తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గవర్నర్లు బీజేపీ ఏజెంట్లుగా మారుతున్నారని, ఆ పార్టీ ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని వారు తుంగలో తొక్కుతున్నారని కపిల్ సిబాల్ ఘాటుగా విమర్శించారు.
తమిళనాడు ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే అధినేత విజయ్ని వెంటనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలని కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. మెజారిటీ ఉందో లేదో తేల్చాల్సింది రాజ్భవన్లో కాదని, అసెంబ్లీ వేదికగా ఆయన తన బలాన్ని నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని సిబాల్ స్పష్టం చేశారు. గతంలో సర్కారియా కమిషన్ ఇచ్చిన సిఫార్సులను, సుప్రీంకోర్టు స్థిరపరిచిన చట్టాలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
ఎన్నికల తర్వాత మెజారిటీ కోసం కుదుర్చుకునే పొత్తుల కంటే ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన వారికే ప్రభుత్వం ఏర్పాటు చేసే మొదటి అవకాశం ఇవ్వాలని రాజ్యాంగ నిబంధనలు చెబుతున్నాయని సిబల్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగ విలువలను వినేవారు ఎవరూ లేరని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.