న్యూఢిల్లీ: రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించిన బిల్లుల అంశం తమ వద్దకు చేరకముందే గవర్నర్లు తప్పనిసరిగా వాటిపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు (Supreme Court) కఠినంగా వ్యాఖ్యానించింది. బిల్లులను ఆమోదించడంలో జాప్యంపై పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్కు వ్యతిరేకంగా పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా గవర్నర్ల తీరుపై సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ‘బిల్లుల విషయం సుప్రీంకోర్టుకు రాక ముందే గవర్నర్లు చర్యలు తీసుకోవాలి. గవర్నర్లకు ఆత్మ పరిశీలన అవసరం. ఈ విషయం వారికి తెలియాలి. ఎన్నికైన ప్రజాప్రతినిధులు కాదన్న విషయాన్ని వారు గ్రహించాలి’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పెండింగ్ బిల్లులపై పంజాబ్ గవర్నర్ తీసుకున్న చర్యలకు సంబంధించిన తాజా పరిస్థితిపై నివేదికను నవంబర్ 10 నాటికి సమర్పించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది. తదుపరి విచారణ ఆ తేదీకి వాయిదా వేసింది.
కాగా, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన 27 బిల్లుల్లో 22 బిల్లులకు గవర్నర్ పురోహిత్ ఆమోదం తెలిపారు. అయితే అక్టోబరు 20న బడ్జెట్ నాల్గొవ ప్రత్యేక సెషన్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు ద్రవ్య బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలుపలేదు. బడ్టెట్ సమావేశాలను ఇలా పొడిగించడం అక్రమం, చట్టవిరుద్ధమని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో అక్టోబర్ 20, 21న రెండు రోజులపాటు జరుగాల్సిన బడ్జెట్ పొడిగింపు సమావేశాలను పంజాబ్ ప్రభుత్వం కుదించింది. పంజాబ్ ఆర్థిక, బడ్జెట్ నిర్వహణ (సవరణ) బిల్లు 2023, పంజాబ్ వస్తు సేవల పన్ను (సవరణ) బిల్లు 2023, ఇండియన్ స్టాంప్ (పంజాబ్ సవరణ) బిల్లు 2023కు గవర్నర్ క్లియరెన్స్ ఇవ్వకపోవడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది.