PM Modi | న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ (ESTIC)ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. ప్రైవేట్ రంగంలో పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించేలా వాతావరణం కల్పించేందుకు రూ.లక్ష కోట్ల నిధిని ఉపయోగించనున్నట్లు ప్రధాని తెలిపారు. ఈ సందర్భంగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ సాధించిన భారత జట్టును, బాహుబలి రాకెట్ను విజయవంతంగా నింగిలోకి పంపిన భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోను ఆయన అభినందించారు. ఆయన మాట్లాడుతూ కార్యక్రమం సైన్స్కు సంబంధించిందని.. కానీ తొలుత క్రికెట్లో భారత్ సాధించిన అద్భుతమైన విజయం గురించి మాట్లాడుతున్నానన్నారు. భారత మొత్తం తమ జట్టు సాధించిన విషయంతో సంతోషంగా ఉందని.. మహిళల జట్టు తొలి ప్రపంచకప్ని సాధించిందని.. ఇందుకు తాను మహిళా జట్టును హృదయపూర్వకంగా అభినందిస్తున్నాన్నారు. విజయాన్ని చూసి గర్విస్తున్నానని.. ఈ విజయం దేశంలోని కోట్లాది మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.
ఆ తర్వాత భారీ ఉపగ్రహాన్ని అత్యంత బరువైన ఉపగ్రహాన్ని ప్రయోగించినందుకు ఇస్రోను అభినందించారు. నిన్న భారత్ శాస్త్ర సాంకేతిక రంగంలో జెండా ఎగుర వేసిందని.. శాస్త్రవేత్తలు అత్యంత బరువైన కమ్యూనికేషన్ శాటిలైట్ను విజయవంతంగా ప్రయోగించారన్నారు. ఈ మిషన్, ఇస్రోతో సంబంధం ఉ్న శాస్త్రవేత్తలందరినీ తాను అభినందిస్తున్నానన్నారు. రూ.లక్ష కోట్ల నిధి ప్రైవేట్రంగంలో పరిశోధనలను ప్రోత్సహిస్తుందన్నారు. ఈ రోజు శాస్త్ర సాంకేతిక ప్రపంచంలో కూడా గొప్పరోజని.. 21వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు కలిసి కొత్తతరం శాస్త్ర సాంకేతిక రంగాలకు మార్గదర్శకత్వం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పరిశోధన అభివృద్ధి ఆవిష్కరణ పథకాన్ని ప్రారంభించామని.. దానికి రూ.లక్ష కోట్ల నిధిని కేటాయించామన్నారు.
‘రూ.లక్ష కోట్లు మోదీ వద్దే ఉంటుందని మీరు అనుకోవచ్చు. అందుకే మీరు చప్పట్లు కొట్టడం లేదు. ఈ లక్ష కోట్లు మీ కోసం (శాస్త్రవేత్తలు). ఇది మీ సామర్థ్యాలను పెంపొందించడానికి. ఇది మీ కోసం కొత్త అవకాశాలను తెరవడానికి. ప్రైవేట్ రంగంలో కూడా పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించడమే మా ప్రయత్నం’ అని పేర్కొన్నారు. భారతదేశం హై రిస్క్, అధిక ప్రభావ పరిశోధన ప్రాజెక్టులకు మద్దతు ఇస్తోందని ప్రధాని తెలిపారు. ఈ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను సైన్స్ అండ్ టెక్నాలజీకి శక్తి కేంద్రంగా ఎదగడానికి ప్రోత్సహిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో ఆధునిక ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను పెంపొందించడానికి తమ ప్రభుత్వం గణనీయమైన సంస్కరణలను చేపట్టిందన్నారు.
ఒక దశాబ్దంలో పరిశోధన వ్యయం రెట్టింపు అయ్యిందని.. మా ప్రభుత్వం ఆర్థిక నియంత్రణ, సముపార్జన విధానంలో గణనీయమైన సంస్కరణలు చేసిందని చెప్పారు.ఇది భారత్ ఆవిష్కరణ పట్ల నిబద్ధతను ప్రతిబింబిస్తుందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాలలో పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, వృద్ధి-అభివృద్ధికి కొత్త అవకాశాలను సృష్టించడానికి ప్రభుత్వం అనుసంధాన్ రీసెర్చ్ ఫౌండేషన్ను స్థాపించిందని తెలిపారు. దశాబ్దం కిందట భారత్లో మహిళలు దాఖలు చేసే పేటెంట్ల సంఖ్య ఏటా వంద కంటే తక్కువగా ఉండేదని.. ప్రస్తుతం ఈ సంఖ్య 5వేలకు పెరిగిందన్నారు. భారత్లో STEM విద్యను అభ్యసిస్తున్న వారిలో 43శాతం మంది మహిళలు ఉన్నారని.. ఇది ప్రపంచ సగటు కంటే చాలా ఎక్కువ అని ప్రధాని వివరించారు.