న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని బ్రిటీష్ కాలం నాటి ఆఫీసు బిల్డింగ్లు ఉన్న నార్త్, సౌత్ బ్లాకులను శుక్రవారం పూర్తిగా ఖాళీ చేయనున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం కూడా కొత్తగా నిర్మించిన సేవా తీర్థ్ కాంప్లెక్స్కు మారనున్నది. అయితే ఆఫీసును మార్చడానికి ముందు .. శుక్రవారం ప్రధాని మోదీ(PM Modi) చివరిసారి క్యాబినెట్ భేటీ ఏర్పాటు చేయనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు పాత ఆఫీసులో ఆ భేటీ ఉండనున్నది. లుటెన్స్ ఢిల్లీలోని రైసినా హిల్స్లో ఉన్న సౌత్ బ్లాకులో చివరిసారి కేంద్ర క్యాబినెట్ భేటీ జరగనున్నది.
నార్త్ బ్లాక్ నుంచి కేంద్ర హోంశాఖ కార్యాలయాన్ని పూర్తిగా షిఫ్ట్ చేశారు. కామన్ సెంట్రల్ సెక్రటేరియేట్లోని 347 రూమ్ కాంప్లెక్స్కు హోంశాఖను తరలించారు. ఒక్క పీఎంవో మినహా ఆ కాంప్లెక్స్లో అన్ని ప్రభుత్వ మంత్రులు, శాఖల ఆఫీసులు ఉన్నాయి. సెంట్రల్ ఢిల్లీలోని ప్రత్యేక కాంప్లెక్స్లో పీఎంవోను నిర్మించారు. పీఎంవోను ఇక నుంచి సేవాతీర్ధ్ అని పిలవనున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 13వ తేదీన జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ సేవాతీర్ధ్, కర్తవ్యభవన్-1,2లను ఆవిష్కరిస్తారని ప్రభుత్వం ఇవాళ ఓ ప్రకటన రిలీజ్ చేసింది.
కొత్త ఆఫీసు బిల్డింగ్ను ప్రారంభించడంతో.. భారతీయ అధికార పరిపాలనా విభాగంలో కొత్త మైలురాయి చేరుకున్నట్లు అవుతుంది. ఆధునిక, పటిష్టమైన, సౌకర్యవంతమైన పరిపాలనా వ్యవస్థను అందిచే ఉద్దేశంతో కొత్త బిల్డింగ్లను నిర్మించినట్లు అధికారులు పేర్కొన్నారు. గతంలో దూరం దూరంగా ఉన్న వివిధ శాఖల ఆఫీసులను ఇప్పుడు ఒకే దగ్గరికి తీసుకువచ్చారు. పరిపాలనను మరింత సులభం చేయాలన్న ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
సేవా తీర్థ్లో ప్రధానమంత్రి కార్యాలయం, నేషనల్ సెక్యూర్టీ కౌన్సిల్ సెక్రటేరియేట్, క్యాబినెట్ సెక్రటేరియేట్ ఉంటాయి. అయితే గతంలో ఇవన్నీ వేర్వేరు ప్రాంతాలను నుంచి ఆపరేట్ అయ్యేవి. ఇక కర్తవ్య్ భవన్ 1,2లో అనేక కీలక మంత్రిత్వశాఖల ఆఫీసులు ఉంటాయి. ఆర్థిక, రక్షణ, ఆరోగ్య, కార్పొరేట్ సర్వీసెస్, విద్య, సంస్కృతి, న్యాయ, సమాచార- ప్రసార, వ్యవసాయ, రసాయనిక, గిరిజన శాఖ ఆఫీసులు ఉంటాయి. అన్ని ఆఫీసుల మధ్య డిజిటల్ ఇంటిగ్రేషన్ ఉంటుంది.
ప్రస్తుత నార్త్, సౌత్ బ్లాకుల వద్ద ప్రపంచ స్థాయి మ్యూజియంను నిర్మించనున్నారు. యుగే యుగే భారత్ మ్యూజియంలో భారతీయ నాగరికత ప్రయాణాన్ని చిత్రీకరించనున్నారు. అయితే ఇప్పటికే నార్త్ బ్లాక్ వద్ద మ్యూజియం పనులు ప్రారంభమైనట్లు తెలుస్తున్నది.