Parliament Session | న్యూఢిల్లీ/(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాపై నెలకొన్న సస్పెన్స్ వీడకముందే సమావేశాలకు సమయం ఆసన్నమైంది. నేటి నుంచి (సోమవారం) పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఘన చరిత్ర కలిగిన పార్లమెంట్ పాత భవనంలో సోమవారం సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అనంతరం మంగళవారం నుంచి కొత్త పార్లమెంట్లో సమావేశాలు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించి ఆదివారం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ అంకురార్పణ చేశారు.
కొత్త పార్లమెంట్ భవనం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాను ఇటీవల కేంద్ర విడుదల చేసింది. సంవిధాన్ సభ నుంచి మొదలుకొని 75 ఏండ్ల భారత పార్లమెంటరీ ప్రస్థానంపై సోమవారం చర్చ జరగనుంది. 75 ఏండ్లలో భారత్ సాధించిన ఘనతలు, అనుభవాలు, జ్ఞాపకాలపై సోమవారం పార్లమెంట్లో చర్చించనున్నారు. అనంతరం సమావేశాల రెండో రోజు (మంగళవారం) నుంచి కొత్త పార్లమెంట్ భవనం సమావేశాలకు వేదిక కానున్నది. రెండో రోజు నుంచి ఇరు సభల్లో కేంద్రం పలు బిల్లులను ప్రవేశపెట్టాలని భావిస్తున్నది. వీటిపై చర్చ జరిగే అవకాశం ఉంది. రాజ్యసభలో మూడు బిల్లులు, లోక్సభలో నాలుగు బిల్లులను ఆమోదించుకోవాలని కేంద్రం అనుకుంటున్నది. వీటిలో కొన్ని బిల్లులను రాజ్యసభ ఇప్పటికే ఆమోదించగా.. లోక్సభ ఆమోదం తెలపాల్సి ఉంది.
అడ్వకేట్స్ (సవరణ) బిల్లు- 2023, ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ పీరియాడికల్ బిల్లు-2023, పోస్ట్ ఆఫీస్ బిల్లు-2023, ప్రధాన ఎన్నికల అధికారి, ఎన్నికల అధికారులు (నియామకం, సర్వీస్ నిబంధనలు) బిల్లు-2023
రిపీలింగ్ అండ్ అమెండ్మెంట్ బిల్లు-2023, పోస్టల్ బిల్లు, ఎన్నికల అధికారులు (నియామకం, సర్వీస్ నిబంధనలు) బిల్లు-2023
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాను కేంద్రం విడుదల చేసినప్పటికీ దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కేంద్రం ప్రకటించిన ఎజెండా నమ్మశక్యంగా లేదని రాజకీయ, మీడియా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అసలు ఎజెండా ఏంటనే సస్పెన్స్ ఇప్పటికీ వీడటం లేదు. ప్రత్యేక సమావేశాల్లో ఏం జరగబోతుందో కనీసం క్యాబినెట్ మంత్రులకైనా తెలిసి ఉంటే ఈ పాటికి రహస్య ఎజెండాలోని అంశాలు బయటికి వచ్చేవి. ఈ విధంగా గుట్టు చప్పుడు కాకుండా అనుసరించిన వ్యూహాన్ని అప్పట్లో పెద్ద నోట్ల రద్దు విషయంలో కేంద్రం అనుసరించింది. పెద్దనోట్ల రద్దు నిర్ణయం వెల్లడించిన రోజు క్యాబినెట్ మీటింగ్ జరగగా.. ఆ సమావేశానికి మంత్రులు ఎవరు ఫోన్లను తీసుకురావద్దని సూచించిన విషయం తెలిసిందే. అదే తరహా గోప్యతను తాజా సమావేశాల్లోనూ కేంద్రం అనుసరిస్తుండటంతో అనుమానాలు బలపడుతున్నాయి. సాధారణ బిల్లులను చర్చించేందుకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అసలైన రహస్య ఎజెండా ఇంకేదో ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన అంశాలను రహస్యంగా ఉంచి చివరి నిమిషంలో బయటపెట్టడం కేంద్రంలోని బీజేపీ సర్కార్కు మొదటి నుంచి అలవాటేనని వారు పేర్కొంటున్నారు.
రహస్య ఎజెండా ఏంటన్నది ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు మాత్రమే తెలుసని పలువురు అంటున్నారు. ఈ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల వ్యవధి లేదని లోక్సభ సచివాలయంబులెటిన్లో వెల్లడించింది. దీంతో సభ్యులు చర్చించేందుకు కూడా వీలులేని అంశం ఏంటనే సస్పెన్స్ ఇప్పటికీ వీడటం లేదు. ఈ ఉత్కంఠకు తెర పడాలంటే సమావేశాల వరకు వేచిచూడక తప్పదు.
మరోవైపు ఈ సమావేశాలను మొదట ప్రత్యేక సమావేశాలుగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొనగా.. కేంద్రం దీనిపై యూటర్న్ తీసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న సమావేశాలు శీతాకాల సమావేశాల్లో భాగమేనని తాజాగా కేంద్రం వెల్లడించింది. నవంబర్, డిసెంబర్లో ఐదు రాష్ర్టాల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో ముందుగానే శీతాకాల సమావేశాలు ఏర్పాటు చేసినట్టు తెలుస్తున్నది.
మహిళా రిజర్వేషన్ బిల్లు, జమిలి ఎన్నికల కోసం సమావేశాలు ఏర్పాటు చేశారనే ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుత లోక్సభ పదవీకాలం వచ్చే ఏడాది మే వరకు ఉంది. వాజపేయి హయాంలో 2004లో అతి విశ్వాసంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లి బీజేపీ భంగపాటుకు గురైంది. గత అనుభవాల దృష్ట్యా ముందస్తుకు వెళ్లే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు జమిలి ఎన్నికల కోసం అని ప్రచారం జరగగా.. మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలో జమిలి ఎన్నికలపై ఏర్పాటు చేసిన కమిటీ ఇంకా నివేదిక ఇవ్వకపోవడంతో దీనికి కూడా అవకాశం లేదని తేలిపోయింది. ఓబీసీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం అయి ఉంటుందని మీడియా వర్గాలు పేర్కొంటుండగా.. దీనిపై 2017లోనే కేంద్రం కమిషన్ ఏర్పాటు చేసింది.